కాఫీవిత్…రమాదేవి.ఆర్…1507

*If you are not ...నువ్వు లేకపోతే ఎలా? *ఓయ్.!అసలు...నువ్వు లేకపోతే ఏమైపోయేదాన్నో…”!!
ఆర్. రమాదేవి మార్క్ కవిత ఇది.అతగాడు(జతగాడు) లేకుంటే? ప్రేమ/ ప్రణయ జీవితంలో ఇటు
వంటి ప్రశ్నే తలెత్తదు..అయినా అతగాడు లేకుంటే ఏమవుతుంది? ఎలా తన జీవన నౌక తీరం చేరుతుంది? అంతెందుకు? తన జీవనరాగానికి అతడే కదా..’ శ్రుతి ‘ ‘గతి’...ఈ వైనమేంటో తెలుసుకోవాలంటే
ఈరోజు కాఫీటైమ్లో రమాదేవి కవితను చదవాల్సిందే..!

“నువ్వు
రంగులేని ఆకాశం చూపిస్తావు
నిశ్శబ్దంగా ఉన్న గాలిని పలకరిస్తావు
తప్పిపోయిన ఊరిని తెచ్చి నిలబెడతావు
అంతేనా
ఎంతో మందిని కూడేసుకుని
అంతులేని  కబుర్లు చెప్తావ్
వదిలి వెళ్ళిన మనుషుల్ని
వదిలి వచ్చేసిన మనుషుల్ని
తెలియని మనిషిని …
తెలుసుకోలేని మనిషిని
ఒకరా ఇద్దరా! లెక్కే తేలదుగా
ఇవన్నీ
ఎక్కడ నేర్చుకొచ్చావ్ ?
నది లోతుల్లో నుంచా …
సముద్రపు నురగ నుంచా!
నా ….
కంటికి కనిపించని నలుసు కూడా
ఆకుపచ్చని కొండలా నీకు కనిపిస్తుంటే
ఏడేడు వర్ణాల ఆకాశమంత
ఆశ్చర్యం వేస్తుంది నాకు....
నిజం చెప్తున్నా...
నాకు కనిపించని దేవుడు
నీ పక్కన ఉన్నట్టుంటుంది
ఎప్పుడో ఒకసారి
నాతో కూడా మాట్లాడమని చెప్పవూ
ఓయ్
అసలు...
నువ్వు లేకపోతే
ఏమైపోయేదాన్నో…”!!
*ఆర్.రమాదేవి..!!

ప్రేమన్నాక పదనిసలు,జీవితమన్నాక కష్ట,సుఖాలు తప్పవు.ఇవే లేకుంటే జీవితంలో ‘కిక్కే’వుండదు.
అతగాడు అలిగినప్పుడామె.ఆమె అలిగినప్పుడతగాడు బతిమిలాడాలి..దారిలోకి తెచ్చుకోవాలి.
అలకలు,కలతలు నలతలు సర్వ సహజం..అయినా ప్రేమ సముద్రంలో ఆటుపోట్లు తప్పవు.అంత
మాత్రంచేతే సముద్రాన్ని వదిలేసి,తీరం దాటితే ఆ ప్రేమ నిలవదు..ఒక అల అలిగితే ఇంకో అల వ
వెంటబడి బతిమిలాడినట్లు ప్రేమికులు ఒకరినొకరు…లాలిస్తూ, బుజ్జగించుకుంటూ వుండాలి.అప్పుడే
ఆ ప్రేమ కలకాలం నిలిచి వుంటుంది…
ఆమె ప్రేమించే అతగాడు మామూలోడేం కాదు సుమా! రంగులేని ఆకాశం చూపిస్తాడు.నిశ్శబ్దంగా ఉన్న గాలిని పలకరిస్తాడు..తప్పిపోయిన ఊరిని తెచ్చి నిలబెడతాడు..
అంతేనా..?
ఎంతో మందిని కూడేసుకుని అంతులేని  కబుర్లుచెబుతుంటాడు..వదిలి వెళ్ళిన మనుషుల్ని,వదిలి
వచ్చేసిన మనుషుల్ని,తెలియని మనిషిని తెలుసుకోలేని మనిషిని ఒకరా ఇద్దరా ! లెక్కే తేలనంత
మందితో కబుర్లే కబుర్లు..అంతులేని కబుర్లు..! ఇవన్నీ ఎక్కడ నేర్చుకొచ్చావ్? సఖుడా ! నది
లోతుల్లో నుంచా ? సముద్రపు నురగ నుంచా? తన కంటికి కనిపించని నలుసు కూడా ఆకుపచ్చ
ని కొండలా అతగాడికి  కనిపిస్తుంటే ఏడేడు వర్ణాల ఆకాశమంత ఆశ్చర్యం వేస్తుందామెకు.

ఓ సఖుడా,! నా ప్రియుడా! నిజం చెప్తున్నా…
నాకు కనిపించని దేవుడు నీ పక్కనే ఉన్నట్టుంటుంది…ఎప్పుడైనా  ఓసారి  నాతో కూడా….
మాట్లాడమని ఆ దేవుడితో చెప్పవూ అంటోంది. రమాదేవి…!

“ఓయ్!  నా సఖా..! అసలు..నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో” అంటారు రమాదేవి..ఈ
వాక్యమే ఈ కవితకు ప్రాణం పోసింది..ప్రియ సఖుడి సాంగత్యం లేకుంటే పడే ఇబ్బంది,
బాధల్ని అన్యాపదేశంగా ఈ కవితలో వ్యక్తీకరించింది కవయిత్రి. .ప్రేయసీ ప్రియులైనా,భార్యాభర్తలైనా..
తోడూనీడగా కలిసివుంటేనే సుఖం అని పెద్దలుఊరకే అన్నారా..!
*ఎ.రజాహుస్సేన్..!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!